ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:43 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. అమరావతిలో వెంకటపాలెం దగ్గర టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందన్నారు ఆలయ సూపరింటెండెంట్‌ మల్లికార్జునరావు తెలిపారు. నేటి నుంచి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని.. ఒక్కో లడ్డూ రూ.50కు విక్రయిస్తామన్నారు.


ప్రస్తుతం వారానికి 5 వేల లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ సూపరింటెండెంట్‌ మల్లికార్జునరావు చెప్పారు. అయితే అవసరాన్ని బట్టి మరికొన్ని ప్రసాదాలను తెప్పిస్తామని.. ఒక్కో భక్తునికి రెండు లడ్డూలు ఇస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న దాన్నిబట్టి అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. తిరుమల నుంచి లారీల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదం విజయవాడ వస్తుందని.. అక్కడ నుంచి అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయం ఆ తరువాత టీటీడీ విశాఖపట్నం వరకు ఉన్న టీటీడీ ఆలయాలకు పంపిస్తారని తెలియజేశారు.


కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాలను తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారని.. అందుకే టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు ఈవో జే శ్యామలరావు తెలిపారు. ముఖ్యంగా టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడపలో కూడా లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి.


అంతేకాదు అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, పిఠాపురం, రంపచోడవరంలో కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2వ తేదీ 50 వేలు, సెప్టెంబర్ 3వ తేదీ 13 వేలు సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని ఈవో సూచించారు. అంతేకాదు బయట ప్రాంతాల నుంచి చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారని.. తిరుమలకు విచ్చేసే భక్తులకు లడ్డూలు సరిపోతున్నందున బయట ప్రాంతాలలో లడ్డూ ప్రసాదాలను విక్రయించలేదన్నారు. అయితే తిరుమలలో లడ్డూ దళారులను కట్టడి చేయడం ద్వారా, బయట ప్రాంతాలకు లడ్డూ ప్రసాదాలు పంపుతున్నట్లు తెలిపారు ఈవో.


శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్‌ ఆవిష్కరణ


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీజె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.


శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com