ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:33 PM

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొట్టిన బోట్ల వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తులకు చెందిన బోట్లుగా గుర్తించినట్లు సమాచారం. బోట్లు ఢీ కొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. ఈ సమయంలోనే వరద నీటితో పాటుగా బోట్లు కొట్టుకువచ్చాయి. ఈ బోట్లు గేట్లను తాకడంతో.. ప్రకాశం బ్యారేజీ 67,69 గేట్లు కాస్త దెబ్బతిన్నాయి. ఒక బోటు కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టడంతో అది కాస్తా విరిగిపోయింది. అలాగే 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డుపడ్డాయి. దీంతో ఆయా గేట్ల నుంచి వరద నీటి ప్రవాహం నిలిచిపోయింది. మిగిలిన గేట్ల ద్వారానే అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే దెబ్బతిన్న గేట్ల వద్ద అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.


నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో అధికారులు 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్‌లను అమర్చారు. రెండు రోజులపాటు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమించి గేట్ల మరమ్మత్తు పనులు పూర్తిచేశారు. నదిలో నీరు ప్రవహిస్తున్నా, భారీ వర్షం కురుస్తున్నా కూడా లెక్కచేయక మరమ్మత్తు పనులను పూర్తిచేశారు. మరోవైపు వరద ప్రవాహంలో బోట్లు కొట్టుకువచ్చి గేట్లను ఢీకొట్టడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకేసారి నాలుగు పడవలు బ్యారేజీ గేట్లను తాకడం వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నీటిపారుదలశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.


ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్ల కింద విజయవాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులను గుర్తించినట్లు తెలిసింది. బోట్లు గొల్లపూడి, సూరాయపాలెనికి చెందినవారివిగా గుర్తించారు. ఇక ప్రమాదవశాత్తూ ఇవి కొట్టుకువచ్చాయా లేదీ వీటి వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే విషయమై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com