ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తీసుకురావడంపై ఫోకస్ పెట్టారు. కొద్దిరోజులుగా పలువురు వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. ఏపీ సీఎం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.. అవసరమైన స్థలాలు, రాయితీలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
భారత్లో ఈవీ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావిస్తున్న విన్ఫాస్ట్.. ఈ మేరకు ప్రతినిధుల్ని భారత్కు పంపింది. ఈ క్రమంలో విన్ఫాస్ట్ ప్రతినిధి బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను.. విన్ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎంతో పేరున్న సంస్థ విన్ఫాస్ట్ ఏపీకి రావాలని.. ఈవీ, బ్యాటరీ తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ఋలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా తాము సహాయ, సహకారం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు విన్ఫాస్ట్ ప్రతినిధులకు విందు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విన్ఫాస్ట్ సంస్థ ఆసక్తి చూపిస్తోందని.. ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు ఈ విషయాన్ని వివరించినట్లు పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాయితీలపై చర్చించి, అంతా అనుకూలంగా ఉంటే.. రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయమై ఓ నెలలో స్పష్టత వస్తుందన్నారు.
విన్ఫాస్ట్ రూ.4వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాయలసీమలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే అవసరమైన భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్కు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరుందని చెబుతారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయంగా పేరున్న కియా సంస్థ అనంతపురం జిల్లాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి వస్తే.. రాయలసీమల ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులురెండు రోజుల క్రితం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ ముందుకొచ్చింది.. దీనిని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa