కృష్ణా జిల్లా రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల చేరికలతో హడావిడి నెలకొంది. తాజాగా వంగవీటి రాధాకృష్ణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కృష్ణ భవిష్యత్ కార్యచరణ ఇంకా ప్రకటించలేదు. ఈనెల 25న చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కేందుకు రాధా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాధా రాకను టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. అలాగే రాధాను కలుపుకుపోవాలని కూడా సూచించారు. ఇకపోతే బుధవారం టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్ వంగవీటి రాధాకృష్ణను ఆయన కార్యాలయంలో కలిశారు. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంపించిన సమాచారాన్ని రాధకు తెలియజేశారు. అలాగే రాధాకృష్ణ సైతం పలు సూచనలు చేసినట్లు టీడీ జనార్థన్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం రాధా పలు సూచనలు చేశారని వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాధాకృష్ణ పార్టీలో చేరే అంశంపై గురువారం మీడియా సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు. రాధాకృష్ణ ఎల్లుండి శుక్రవారం టీడీపీలో చేరే అవకాశం ఉందన్నారు. రాధా రాకతో పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీడీపీ నేతలు అంతా కలిసే పనిచేస్తారని స్పష్టం చేశారు. రాధాకృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తారా లేక విజయవాడ సెంట్రల్ సీట్ ఇస్తారా అన్నది చంద్రబాబు నిర్ణయమన్నారు. పార్టీలో చేరే వ్యక్తులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసునన్నారు. ఇకపోతే రాధా ఈనెల 21న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం రాధాకృష్ణ మీడియా సమావేశంలో తాను ఏపార్టీలో చేరబోతున్నారనేది స్పష్టం చేయనున్నారు. అయితే రాధా టీడీపీలో చేరనున్నారని ఈనెల 25న టీడీపీలో చేరే అవకాశం ఉందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.