ప్రధాని నరేంద్ర మోడీయే మరొకసారి ప్రధాని కావాలని బెంగాల్ ప్రజలు అనుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో జరిగిన బహిరంగ సభలో అమిత్షా ప్రసంగిస్తూ పంచాయతీ ఎన్నికల్లో టిఎంసి గూండాలు ప్రజలను ఓటు వేయనీయలేదని ఆరోపించారు. బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకు వస్తే బెంగాల్లోకి చొరబాట్లు జరగకుండా చూస్తామన్నారు. అయితే వీళ్లు (టిఎంసి) చొరబాటుదారులను అభిమానిస్తారని ఆయన చెప్పారు. అందుకే తాము ఎన్ఆర్సి గురించి మాట్లాడితే తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారని ఆయన అన్నారు. 2019 ఎన్నికలు దేశ భవిష్యత్తునే కాకుండా, పశ్చిమ బెంగాల్ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. టిఎంసి అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయం కూడా తెలిసిపోతుందని ఆయన అన్నారు.