టీడీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీకి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ, మేడా గైర్హాజరు అయ్యారు. తాజాగా మేడా మల్లికార్జున రెడ్డి, తన సోదరుడు మేడా రఘునాథ రెడ్డి తో కలిసి వైసీపీలో చేరనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో మేడా వైసీపీలో చేరుతారని పేర్కొన్నాయి.మరోవైపు మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీకి ద్రోహం చేశారని సీఎం రమేశ్ మండిపడ్డారు. టీడీపీలో చేరినవెంటనే మేడాకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారనీ, ఆయన తండ్రికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా నియమించారనీ, కోరిన కాంట్రాక్టులు, పనులు చేయించారని గుర్తుచేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట టీడీపీ నేతలు ఈరోజు చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా మేడాకు పోటీగా రెడ్ బస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ రాజు పేరును మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే.