నిరసనలు, ఆందోళనలతో రెండు నెలలుగా ఉద్రిక్తంగా మారిన శబరిమల ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. పందళరాజ వంశస్థుడు రాఘవ వర్మ రాజా ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయ గర్భగుడిని మూసేశారు. దాదాపు 67రోజుల పాటు అయ్యప్ప స్వామి పూజలు అందుకున్నాడు. వార్షిక మండల యాత్ర ముగిసిన అనంతరం ఆలయాన్ని మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మళ్లీ వచ్చే నెల 13న మలయాళ మాసమైన కుంభమాసాన్ని పురస్కరించుకుని కొంత సమయంపాటు ఆలయాన్ని తెరవనున్నారు. కాగా, ఆలయాన్ని మూసివేయడంతో బీజేపీ కార్యకర్తలు తమ నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నించినా అవన్నీ విఫలమయ్యాయన్నారు. సంప్రదాయం ముసుగులో రాష్ట్రంలో రెండు నెలలపాటు అల్లర్లు సృష్టించిందని ఆరోపించారు.