తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు. జైలు నిబంధనలకు విరుద్దంగా అధికారులు ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సహకరిస్తున్నారని తాజా విచారణలో వెల్లడైంది. బెంగళూరులోని పరప్పన జైల్లో శశికళకు కల్పించిన ప్రత్యేక వసతులపై విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ వినయ్ కుమార్ నేత్రుత్వంలోని టీమ్ ఈ విషయాలను తమ నివేదికలో వెల్లడించింది.సీఎన్ఎన్ న్యూస్18కి అందిన వినయ్ కుమార్ టీమ్ నివేదిక ప్రకారం.. అగస్టు 15, 2017న జైలును సందర్శించిన అప్పటి డీఐజీ రూప.. శశికళ, ఆమె బంధువు ఇళవరసిని ఉంచిన కారిడార్ రెండు వైపులా బారికేడ్స్తో క్లోజ్ చేసి ఉండటాన్ని గుర్తించారు. దాన్నో ప్రైవేట్ స్పేస్లా వాడుకోవడానికే ఆ ఏర్పాటు చేసినట్టు నిర్దారించారు. కారిడార్లో మొత్తం ఐదు సెల్స్ ఉండగా.. అవన్నీ శశికళ నియంత్రణలోనే ఉన్నట్టుగా గుర్తించారు. ఆ ఐదు సెల్స్ లోనూ ఆమెకు సంబంధించిన వస్తువులే ఉన్నట్టు గుర్తించారు.
అంతేకాదు, జైల్లో వంట చేసుకోవడానికి కూడా శశికళకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. అప్పటి డీఐజీ రూప శశికళ వంట సామాగ్రి అయిన ప్రెజర్ కుక్కర్, వంట పాత్రలు.. జైల్లో ఆమెకు జరుగుతున్న రాచ మర్యాదలపై ఫోటోలు కూడా బయటపెట్టారు.
'కారిడార్&శశికళ ఐదు సెల్స్' పేరిట వినయ్ కుమార్ టీమ్ నివేదికను విడుదల చేసింది. 14.02.2017న శశికళ ఇంకా ఆ బారక్కు రాకముందు.. అందులో ఉన్న ఐదు సెల్స్లో ఐదుగురు మహిళా ఖైదీలు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. కానీ శశికళ రాకకు ముందు వీరందరిని ఖాళీ చేయించేసి.. ఆ ఐదు సెల్స్ను ఆమె కోసమే కేటాయించారని తెలిపారు.
శశికళకు మొదట్లో కల్పించిన క్లాస్-ఏ సౌకర్యాలను ఉపసంహరించుకున్నట్టుగా ఎక్కడా ఎలాంటి ఆధారం లేదని నివేదికలో పేర్కొనడం గమనార్హం. వ్యక్తిగత దుస్తులు ధరించడానికి అనుమతినివ్వడం, తనను కలిసేందుకు వచ్చేవాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడటానికి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో ప్రత్యేక గది కేటాయించడం.. ఇవన్నీ అలాగే కొనసాగుతూ వస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే క్లాస్ ఏ సౌకర్యాలను ఉపసంహరించకపోవడంపై ఎలాంటి వివరణ లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వినయ్ కుమార్ తెలిపారు.కాగా, 2017 ఫిబ్రవరి నెలలో శశికళ జైలు పాలైన సంగతి తెలిసిందే. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా దోషిగా తేలడంతో కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.