అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇందులో భాగంగా మరికాసేపట్లో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలతో మంత్రి అత్యవసరంగా భేటీ కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మేడ మల్లికార్జునరెడ్డికి టీడీపీ నేతలు ఆహ్వానం పంపలేదు. దీంతో ఈ భేటీలో పార్టీ నేతల తీరును నిలదీయాలని తన అనుచరులకు మేడా దిశానిర్దేశం చేసినట్లు సమాచారం . ఈ నేపథ్యంలో రాజంపేటలో ఈరోజు జరిగే టీడీపీ సమావేశం హాట్ హాట్ గా సాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా ఈ నెల 22న టీడీపీ అధినేత చంద్రబాబు రాజంపేట నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.