వచ్చే ఐదేళ్లలో స్విమ్స్ దేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న నెంబర్-1 సంస్థగా రూపొందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్న తమ కృషికి సహకారం అందజేయాలని , ప్రజారోగ్యంలో హ్యాపీనెస్ తీసుకురావాలని కోరారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) పాలకమండలి 18వ సమావేశంలో మాట్లాడుతూ వైద్యసేవలపై ప్రజల్లో పూర్తి సంతృప్తి తేవాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని ప్రజారోగ్య పరిరక్షణకు కృషిచేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఫలితాల సాధనకు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్ప కాలిక లక్ష్యాలతో పనిచేయాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి శాలరీ గ్రాంట్కు బడ్జెట్ ఇస్తామని, అందుకు అనుగుణంగా తదుపరి ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీ, స్విమ్స్ సమన్వయంతో పనిచేయాలని, సేవా పథకాల అమలులో మరింత సహకారం తీసుకోవాలని స్విమ్స్కు సీఎం సూచించారు. స్విమ్స్ లాంటి ఇతర సంస్థలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో తెలుసుకున్న ముఖ్యమంత్రి.. స్విమ్స్ స్వయం పోషకత్వం సాధించేందుకు కృషిచేయాలన్నారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఉత్తమ ప్రమాణాలు తేవాలని ఆదేశించారు.