కోల్కతాలో ఆ రాష్ట్రం సీఎం మమతా బెనర్జీ తలపెట్టిన యునైటెడ్ ఇండియా ర్యాలీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మమతా మెగా ర్యాలీని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో 'అవినీతి నేతల ఐక్యతా ర్యాలీ'గా, వంచన ర్యాలీగా అభివర్ణించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్ష పార్టీలన్ని ఈ అపవిత్ర పొత్తుకు సిద్దపడ్డాయని విమర్శించారు. దీదీ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ గుండాల చేతిలో దాదాపు 44మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమా?.. అని ప్రశ్నించారు. నేటి మెగా ర్యాలీలో పాల్గొన్న విపక్ష నేతల్లో చాలామంది రిటైర్డ్ అయినవారే అని, మరికొంతమంది ప్రజల చేత తిరస్కరించబడినవారని.. అలాంటివాళ్లంతా ఏకమై బీజేపీని ఏం చేయలేరని ఆ పార్టీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. కాగా, మమతా బెనర్జీ మెగా ర్యాలీ తలపెట్టిన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లోనే ఫిబ్రవరి 8న బీజేపీ నిర్వహించబోయే సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారని అన్నారు.