ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గడువు ముగిసిపోయింది.. ఈ దేశానికి కొత్త ప్రధానిని త్వరలోనే తీసుకువస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్కతాలోని బ్రినేడ్ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ వేదిక ఐక్య భారత్కు నిదర్శనంగా నిలవాలి. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేశారు. మోదీ హయాంలో రఫేల్ వంటి పెద్ద కుంభకోణాలు జరిగాయి. లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్, మాయావతి సహా ఎవర్నీ మోదీ ప్రభుత్వం వదల్లేదు. మీతో కలిసి ఉంటే పర్వాలేదు.. లేకపోతే అందరినీ అణగదొక్కుతారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించింది. ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం కూడా మారాల్సిన సమయం వచ్చింది. యువతకు పూర్తిగా ఉపాధి కల్పనను విస్మరించారు. రథయాత్ర పేరిట బెంగాల్ ప్రవేశించాలనుకునే అల్లరి మూకలను ఇక్కడ అడుగుపెట్టనివ్వబోం. మేం జగన్నాథ రథయాత్రను నమ్ముతాం.. కానీ అల్లరిమూకల రథయాత్రలను నమ్మం. ఈసారికి బీజేపీకి ఓటేస్తే మన డబ్బును దోచుకోవడం ఖాయం. బీజేపీకి నాయకత్వం లేదు. కానీ మా కూటమికి అన్ని పార్టీల నాయకత్వం ఉంది. అక్కడ కేవలం ఒక ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. కానీ మా కూటమిలో ప్రతి ఒక్కరూ నాయకుడే అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.