ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిమితి రూ.5లక్షలకు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 03:52 PM

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల ఘాట్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌ సాగర్‌లో సభాపతి కోడెల శివప్రసాద్‌రావుతో కలిసి బోటులో విహరించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, రాష్ట్రానికి భాజపా మేలు చేస్తుందని భావించామన్నారు.


కానీ, భాజపా ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని అన్నారు. కేంద్ర హోంమంత్రి ఈ రోజు కడపలో పర్యటిస్తున్నారని, హోదా విషయంలో మోసం చేసి మళ్లీ ఎందుకు వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com