నవాడ : బిహార్లోని నవాడా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కోసం కేటాయించిన పడకలపై వీధికుక్కలు దర్జాగా పవళించాయి. వివరాల్లోకి వెళితే.. బిహార్లోని నవాడా ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని పడకలు, బెడ్షీట్స్పై వీధికుక్కలు నిద్రిస్తూ కనిపించాయి. దీనిపై రోగులు, వారి సంరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమకు బెడ్షీట్స్, పడకలు కేటాయించాలని ఆస్పత్రి సిబ్బందిని కోరినప్పటికీ సిబ్బంది స్పందించలేదని, అలాంటిది వీధి కుక్కలకు మాత్రం దర్జాగా పడకలు వేసి పడుకోబెట్టారని, రోగులను మాత్రం పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. ఈ విషయంపై ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ పడకలపై వీధికుక్కలు పడుకోవడానికి కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి ఇంఛార్జిల్లో ఒకరైన ఉమేశ్ చంద్ర తెలిపారు. ఇటీవల బిహార్లో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ సరిగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది జులైలో నలంద మెడికల్ కళాశాలలోని గదులనూ వరదనీరు ముంచెత్తింది. ఐసీయూ విభాగంలోకి సైతం వరదనీరు రావడంతోపాటు, అక్కడక్కడా కొన్ని చోట్ల చేపలు కనిపించడంతో రోగులు, వారి సంరక్షకులు విస్తుబోయారు.