అమరావతి: ఆంద్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది పేరును రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారిగా ఆర్పీ సిసోడియాను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకంపై ద్వివేది మాట్లాడుతూ అన్ని శాఖలు సహకరిస్తే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల గడువు దగ్గర పడుతోందని, అందరి సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని ద్వివేది ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని, ఓటర్లలోనూ చైతన్యం రావాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ద్వివేది చెప్పారు.