జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్వ్యాగన్పై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్గారాల కేసులో ట్రైబ్యునల్ ఆదేశించినా డబ్బు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంకా సమయం ఇచ్చేది లేదని.. 24 గంటల్లోగా రూ. 100కోట్లు జమ చేయాల్సిందేనని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఫోక్స్వ్యాగన్ డీజిల్ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఎన్జీటీ గతేడాది నవంబరు 16న ఫోక్స్వ్యాగన్కు జరిమానా విధించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో రూ. 100 కోట్ల జమ చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టిన సంస్థ ఇంతవరకూ ఆ డబ్బును జమ చేయలేదు.
దీంతో ఈ వ్యవహారంపై నేడు మరోసారి విచారణ చేపట్టిన ఎన్జీటీ.. ఫోక్స్వ్యాగన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేకపోయినా మీరు డబ్బు ఎందుకు జమ చేయలేదు. ఇక మీకు ఎలాంటి గడువు ఇవ్వబోం. 24 గంటల్లోగా రూ. 100కోట్లు జమ చేయాల్సిందే. డబ్బు జమ చేసినట్లు శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి’ అని ఎన్జీటీ ఛైర్పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గడువు లోగా డబ్బు జమ చేయకపోతే ఫోక్స్వ్యాగన్ ఇండియా ఎండీని అరెస్టు చేయాల్సి వస్తుందని, అంతేగాక.. భారత్లోని కంపెనీ ఆస్తులను సీజ్ చేస్తామని స్పష్టం చేసింది.