ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. కొమరిన్ తీరంతో పాటుగా దానికి ఆనుకుని దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. అలాగే లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో గురువారం కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో 50.5 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లా ఓలేటిపాలెంలో 48.5 మిల్లీ మీటర్లు, కర్నూలుజిల్లా నందికొట్కూరులో 47.3 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 27 మిల్లీ మీటర్లు, అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత కొనసాగింది. అత్యధికంగా కర్నూలులో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.