ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాదెండ్ల మనోహర్‌ కి అండగా ప్రచారం చేసిన హైపర్‌ ఆది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 05:30 PM

తెనాలిలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించుకుని జనసేన జెండాను రెపరెపలాడిద్దామని సినీనటుడు, జనసేన పార్టీ స్టార్‌ క్యాంపెన్‌ హైపర్‌ ఆది అన్నారు. బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన హైపర్‌ ఆది నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆది మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాళాతీసిందని అభివృద్ధి సంక్షేమం కాస్త అతివృష్టి అనావృష్టిగా మారిందని ఆరోపించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా కులాల మధ్య చిచ్చుపెట్టడం, ప్రజల్లో విద్వేషాలు పెంచడం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే కేసులు, అడ్డుకుంటే దాడులతో రాష్ట్రం అట్టుడికిందని ఆక్షేపించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేత ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ప్రజల కోసం పనిచేసే పవన్‌కు రాష్ట్రం ఏమైపోతే నాకేంటి అధికారమే కావాలంటూ తాపత్రయపడే ముద్రగడ పద్మనాభానికి ఉన్నతేడా ప్రజలే గమనిస్తున్నారన్నారు. తనను కమెడియన్‌ అంటూ మాట్లాడుతున్న వైసీపీ నాయకులు రాష్ట్రంలో జరగని అభివృద్ధిని జరిగినట్లు ప్రజల్లో ప్రచారం చేస్తూ వారే తమనుమించిన కమెడియన్లుగా ప్రజల్లో పేరుపొందారన్నారు. తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధిపనులు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించిన ఘనత మనోహర్‌దేనన్నారు. జనసేన అధికారంలోకి రాకపోయినా పవన్‌ కల్యాణ్‌కు, పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి మనోహర్‌ అన్నారు. ప్రజల కోసం, ప్రాంతం కోసం పాటుబడే మంచి మనసున్న మనోహర్‌ను రానున్న ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి వైసీపీ రాక్షస పాలనను తరిమి కొట్టాలని ఆది పిలుపునిచ్చారు. తొలుత తెనాలి విచ్చేసిన ఆదిని పలువురు ఉమ్మడి పార్టీశ్రేణులు, ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. పెద్దసంఖ్యలో అభిమానులు ఆదితో కలిసి ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. పెద్దసంఖ్యలో ఉమ్మడి పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com