ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను రాయలసీమ బిడ్డనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 10:27 AM

తాను రాయలసీమ బిడ్డనని, ఒక్క అవకాశం ఇస్తే సీమను అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల సందర్భంగా జగన్‌ చెప్పిన మాయమాటలు నమ్మి రాయలసీమ వాసులు దారుణంగా మోసపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆయన పాలనలో రాయలసీమ 30ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో ‘ప్రజాగళం’ సభలో లోకేశ్‌ ప్రసంగించారు. రాయలసీమను అభివృద్ధి బాట పట్టించిన విజనరీ చంద్రబాబు అని, ఆయన సీఎంగా ఉన్న 2014-19 మధ్యకాలంలో సీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టగా, జగన్‌ హయాంలో అందులో కనీసం 10శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య, పింఛా డ్యాంలు కొట్టుకుపోయి 39మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు కనీసం ఇళ్లు కూడా కట్టించలేని చెత్త ప్రభుత్వం జగన్‌దని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపన చేసినా.. ఇప్పటివరకు అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. స్వతంత్ర భారతావనిలో ఇంతవరకు ఎన్నడూ కనని, వినని అత్యంత శక్తిమంతమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నేతృత్వంలో దేశం బలోపేతమైందని లోకేశ్‌ కొనియాడారు. మోదీ నూరు శాతం ‘మేడిన్‌ ఇండియా’లా ఉంటారని, ఆయన కారణంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గౌరవ మర్యాదలు పెరిగాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com