ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహపురి రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. 10 స్థానాల బరిలో ఎవరెవరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 07:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా చాలా కీలకమైనది. ఈ జిల్లాకు ఏపీ రాజకీయాలలో చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి.. వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ జిల్లాలోనే కృష్ణపట్నం పోర్టు ఉంది. ఈ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ రెండు, మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు.. ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఈ జిల్లాలో ప్రజల తీర్పు ఎప్పుడూ విభిన్నంగా ఉంటుందనే చెప్పాలి.


ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 లోక్ సభ నియోజకవరం ఉంటే.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏడు స్థానాల్లో గెలిచింది.. టీడీపీ మూడు స్థానాలకు పరిమితం అయ్యింది. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోరు కాగా.. వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.


నెల్లూరు జిల్లా పరిధిలో ఒక లోక్‌సభ స్థానం


నెల్లూరు జిల్లా పరిధిలో ఒకటే లోక్‌సభ స్థానం ఉంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి కొప్పుల రాజు పోటీలో ఉన్నారు.


నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు


ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా.. అవి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, కోవూరు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈసారి జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని మార్పులు చేర్పులుచేసింది. టీడీపీ మాత్రం అదే నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకే దాదాపుగా టికెట్లు కేటాయించింది. కోవూరు నుంచి పోలంరెడ్డి కుటుంబానికి కాకుండా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది.


వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీలో కొత్తగా ఎండీ ఖలీల్‌ అహ్మద్‌‌ను పోటీ చేయిస్తోంది. అలాగే ఉదయగిరి నుంచి మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డిని బరిలోకి దింపింది. వెంకటగిరిలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.. గూడూరు నుంచి మెరిగ మురళీధర్‌, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయిస్తోంది. టీడీపీ విషయానికి వస్తే.. వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం వైఎస్సార్‌సీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరి.. మళ్లీ రూరల్ నుంచి బరిలోకి దిగారు. అలాగే ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరగా.. ఆయన ఈసారి పోటీ చేయడం లేదు. అక్కడ కాకర్ల సురేష్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌‌‌సీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.. అలాగే జూన్ 4 ఫలితాలను వెల్లడిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com