ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సొంత జిల్లాలో ఏ పార్టీ సత్తా ఎంత.. పోటీలో ఎవరెవరు, ఈసారైనా వాళ్లకు కలిసొస్తుందా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 07:43 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు జిల్లా చాలా కీలకమైనది. ఈ జిల్లా నుంచి చంద్రబాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, గల్లా కుటుంబం, పెద్దిరెడ్డి ఫ్యామిలీ, బొజ్జల, ఇలా ఎంతోమంది హేమా హేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఈ జిల్లా అటు తమిళనాడు, ఇటు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉంటుంది. చిత్తూరు జిల్లా వ్యవసాయం, పరిశ్రమల ఆధారితం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉంది. 2104, 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారిపోయింది. వైఎస్సార్‌సీపీ హవా కనిపిస్తోంది.. చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా 8 చోట్ల విజయం సాధించగా.. టీడీపీ ఆరు సీట్లలో గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో.. 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. కేవలం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే కుప్పనం నుంచి గెలిచారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలు..


చిత్తూరు, తిరుపతి లోక్ సభ స్థానాలు చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా వైఎస్సార్‌సీపీ నుంచి రెడ్డప్ప గెలిచారు. 2024 ఎన్నికల్లో చిత్తూరు నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు.. వైఎస్సార్‌సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రెడ్డెప్ప బరిలో ఉన్నారు.


2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ విజయం సాధించగా.. ఆయన అకాల మరణంతో 2021 ఉప ఎన్నిక వచ్చింది. వైఎస్సార్‌సీపీ నుంచి మద్దెల గురుమూర్తి పోటీ చేయగా.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి బరిలో నిలిచారు.. ఈ ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా వరప్రసాదరావు (బీజేపీ) పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చింతా మోహన్‌ పోటీలో నిలిచారు.


చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు..


చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు, నగరి, పుంగనూరు, కుప్పం 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేసే స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 13 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. ఒక నియోజకవర్గం (తిరుపతి)లో జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ విషయానికి వస్తే.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీలో ఉంది.


ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్పులు, చేర్పులు చేపట్టింది. చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని పక్కన పెట్టి విజయానందరెడ్డిని పోటీ చేయిస్తోంది.. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి బదులు, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి బరిలో ఉన్నారు. చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తుండగగా.. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు. పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌ను పోటీ చేయిస్తున్నారు. గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి బదులు.. ఆయన కుమార్తె కృపా లక్ష్మీ పోటీలో ఉన్నారు. సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను పక్కన పెట్టి నూకతోటి రాజేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మదనపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహ్మద్ నవాజ్ బాషా బదులు నిస్సార్ అహ్మద్ పోటీ చేస్తున్నారు.


తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే.. సత్యవేడులో వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను పోటీ చేయిస్తోంది. తంబళ్లపల్లెలో కూడా వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన కె. జయచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకే తెలుగు దేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఈ నెల 13 (సోమవారం)న పోలింగ్ జరుగుతుంది.. అలాగే జూన్ 4 ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com