ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడెలా అడుగుతావ్? పోసాని కృష్ణమురళి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 07:34 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు, వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. చిరంజీవి తీరుపై మండిపడ్డారు. రాజకీయాలు నాకు సరిపోవంటూ వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జనసేనకు ఓటు వేయమని ఎలా కోరుతారంటూ నిలదీశారు.


"పవన్ కళ్యాణ్‌కు గెలిపించమని చిరంజీవి ఎలా స్టే్ట్మెంట్ ఇస్తారు. ప్రజలంటే ఆయనకు చాలా చీప్ అభిప్రాయం.. వాళ్లేం చేస్తారులే అనుకుంటారు. ఆయన ఓ వెరీగుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో టాప్ హీరో. చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించారా? ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో అయినా కూర్చున్నారా. ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేద్దాం. ఓట్లు వేయకపోతే వెళ్లిపోదాం అనుకున్నారు. ఆయన దృష్టిలో అది బిజినెస్.18 మంది ఎమ్మెల్యేలను మీ దారి మీరు చూసుకోమన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. మరి అక్కడైనా ఉన్నారా?" అని నిలదీశారు


"రాజకీయం నాకు సెట్ కాదు. వద్దని వెళ్లిపోయారు. తప్పుతెలుసుకుని వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ ఇప్పుడెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు. చిరంజీవి జీవితంలో మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లొచ్చా? అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు కాపు యువత బలయ్యారన్న పోసాని.. మళ్లీ ఇప్పుడు జనసేన తరుపున ప్రచారం చేయడానికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు.


మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఏపీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పోసాని అభిప్రాయపడ్డారు. రూపాయి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి నగదు జమ జరుగుతోందన్నారు. సంపద సృష్టించానని చెప్పుకునే చంద్రబాబు.. జనాన్ని మోసం చేస్తున్నారని పోసాని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ఏపీ రెవెన్యూ లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. అబద్ధఫు హామీలతో గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com