మంత్రి అంబటి రాంబాబుపై ఆయన చిన్నల్లుడు గౌతమ్ మరో వీడియో వదిలారు. అంబటి రాంబాబు తీరును విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రి ఐసీయూలో నుంచి తన తండ్రి మనవడు, మనవరాళ్లను చూడాలని తపించారని.. ఆ బాధతోనే ఆయన చనిపోయారంటూ గౌతమ్ ఆరోపించారు. పిల్లలను పంపించాలని కోరినా కూడా అంబటి రాంబాబు పంపలేదన్నారు. ఇప్పటికైనా తన పిల్లలను తనకు అప్పగిస్తే బాగా చూసుకుంటానంటూ అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో రిలీజ్ చేశారు.
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు, ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య సోషల్ మీడియాలో వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. మా మామయ్య నీచుడు ఆయనకు ఓటేయకండంటూ గౌతమ్ ఇటీవల వీడియో రిలీజ్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే ఈ వీడియో మీద స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విలేకర్ల సమావేశం నిర్వహించి వాటిని ఖండించారు. నాలుగేళ్ల నుంచి తన కూతురు, తన మనవడు, మనవరాళ్లు తన వద్దే ఉన్నారని అంబటి రాంబాబు చెప్పారు. వారి అవసరాలు తానే చూస్తున్నానని.. భార్యాపిల్లలను చూసుకోని దుర్మార్గుడు గౌతమ్ అంటూ ఆరోపించారు. దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు. అయితే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ గురించి ఆయన చిన్నల్లుడు గౌతమ్ మరో వీడియో వదిలారు.
"ఇటీవల నేను పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా మామయ్య ఇంత మంచోడా అని నేనేన నమ్మేశా. ఆ ప్రెస్ మీట్లో నాలుగేళ్ల నుంచి తన మనవడు, మనవరాలు తన దగ్గరే ఉంటున్నారని.. వారి ఆర్థిక అవసరాలు జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పారు. అల్లుడైన నేను ఎలాంటి ఆర్థిక సాయం లేదని.. దుర్మార్గున్ని అయితే గీతే నేనేనంటూ మా మామయ్య అంబటి రాంబాబు గారు మాట్లాడారు. నా వెనుక మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నానని అన్నారు. దీని గురించి నేను మాట్లాడుతా" అని గౌతమ్ అన్నారు.
"ఈ వీడియో నేను 2023 మార్చి 3న పంపించిన వీడియో ఇది. ఆయనకు మాట కూడా రావడం లేదు. అయినా కూడా మనవణ్ని, మనవరాలిని చూడాలని నా తండ్రి ఐసీయూ నుంచి కోరుకున్నారు. మార్చి 22 నా తండ్రి చనిపోయాడు. తన మనవణ్ని, మనవరాలిని చూసుకోలేదని ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడో మీకు తెలుసా. మీ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తారా. ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కొడుకుగా మిగిలిపోయా. మీరేదే న్యాయం చేస్తారని నమ్మి నాలుగేళ్లు ఎదురుచూసి.. చివరకు విసిగెత్తి కోర్టుకు వెళ్లా." అని గౌతమ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
"నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవడ్ని, మనవరాలని చూసుకోవాలని పంపించాలని నేను ప్రాధేయపడితే పంపలేదు. ఇప్పటికీ చెప్తున్నా.. నా కొడుకును, కూతురుని మీరు పోషించాల్సిన పనిలేదు. మీరు రూపాయి పెట్టాల్సిన పనిలేదు. రేపు మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. నేను పోషించుకుంటా. కనీసం మీకు ఆత్మసాక్షి ఉందా. మీరే ఆలోచించుకోండి". అంటూ గౌతమ్ వీడియో రిలీజ్ చేశారు.