ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 17 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 07:42 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఈ జిల్లాకు కూడా చాలా పెద్దది.. వ్యవసాయం, గుంటూరు మిర్చికి ఫేమస్. గుంటూరు జిల్లాకు ఏపీ రాజకీయాలలో చాలా ప్రత్యేకత ఉందని చెబుతుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఓటరు ఎటు మొగ్గితే.. ఆ పార్టీకి అధికారం ఖాయమని చెబుతుంటారు. గుంటూరు జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అధికారం చేపట్టబోయే పార్టీలను అంచనా వేస్తుంటారు. 2014, 2019 ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 13 చోట్ల విజయం సాధించగా.. వైఎస్సార్సీపీ నాలుగు సీట్లకే పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో.. 15 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. 2 చోట్ల టీడీపీ గెలుపొందింది.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు లోక్ సభ స్థానాలు..


గుంటూరు, బాపట్ల, నరసరావుపేట లోక్ సభ స్థానాలు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా తెలుగు దేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు.. వైఎస్సార్‌సీపీ నుంచి కిలారి రోశయ్యలు బరిలో ఉన్నారు.


2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలిచారు. 2024 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గార్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌ బరిలో ఉన్నారు. బాపట్ల నియోజకవర్గం విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నందిగం సురేష్ ఎంపీగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎంపీ సురేష్ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నారు.


గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు..


వేమూరు, తాడికొండ, ప్రత్తిపాడు, పెదకూరపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, బాపట్ల, నరసరావుపేట, రేపల్లె, గురజాల, మాచర్ల, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 16 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు.


2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీచేసి గెలిచిన మంత్రి విడదల రజిని నియోజకవర్గం మారి గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మేరుగు నాగార్జున ఈసారి పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి బరిలో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా నియోజకవర్గం మారారు.. ఆమె ప్రత్తిపాడు నుంచి వెళ్లి తాడికొండ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4 ఫలితాలను వెల్లడించనున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com