ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డబ్బులు ఇవ్వొద్దు, ఉచితంగానే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 07:17 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొంటారు. అంతేకాదు టీటీడీ తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు సేవలు అందించే అవకాశం కూడా అందించింది. గతంలో శ్రీవారి సేవకులుగా కొందరికే అవకాశం దక్కేది.. ఇప్పుడు టీటీడీ ఆ పద్దతిని మార్చింది. ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవకులు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.


శ్రీవారి సేవ కోట ఆన్‌లైన్‌‌లో విడుద‌ల చేసిన వెంట‌నే అన్ని తేదీలు బ్లాక్ అవుతున్నాయని కొందరు భక్తులు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. బుక్ చేసుకునే సమయంలో బఫరింగ్ అవుతోందని.. తద్వారా తమలాంటి వారికి ఎక్కడో పారదర్శకత లోపించిందనే అనే అనుమానాలు ఉన్నాయన్నారు. శ్రీవారి సేవ ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఎంతో పారదర్శకతతో రూపొందించబడిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదన్నారు. శ్రీవారి సేవకులు దళారులకు డబ్బులు ఇవ్వొద్దని.. ఏదైనా సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఉచితంగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు.


తిరుమల శ్రీవారి ఆలయం వెండి వాకిలి నుంచి బంగారు వాకిలి దగ్గర తోపులాట జరుగుతోందని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్ల‌ల ఇబ్బంది ప‌డుతున్నారన్నారు. శ్రీ‌వారి ఆల‌యం మ‌హాద్వారం నుంచి బంగారు వాకిలి వ‌ర‌కు ఒకే క్యూ లైన్ విధానంలో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. విజిలెన్స్‌, ఆల‌య సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చి భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.


తిరుమ‌ల‌లో ప్రైవేట్ హోటళ్ళల్లో అధిక రేట్లు వ‌సూలు చేస్తున్నారని.. అలాగే అఖిలాండం వ‌ద్ద వీధి వర్తకులు భ‌క్తుల‌ను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల‌లో ప్రైవేట్ హోటళ్ళల్లో రేట్లు నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఏపీ టూరిజం వారికి త‌క్కువ అద్దెతో 4 హోటళ్లు కేటాయించామని.. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీధి వర్తకులను అదుపు చేస్తారన్నారు.


ఏపీలో ఎన్నికల కారణంగా సిఫార్సు లేఖల్ని స్వీకరించడం లేదని.. శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా బ్రేక్ టికెట్టు పొంద‌వ‌చ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఎన్ ఆర్ ఐ ద‌ర్శ‌నం కూడా పొంద‌వ‌చ్చని.. కోడ్ పూర్త‌య్యేంత‌ వ‌ర‌కు ఎలాంటి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వన్నారు. రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం కుదరదని ఈవో తెలిపారు. తిరుప‌తిలో ఎస్ఎస్‌డి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు.


తిరుమలలో భాష్యకారుల ఉత్సవం


తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 12న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.


భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున శుక్ర‌వారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com