ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కీ.. నొక్కీ అలసిపోయారని.. మే 13వ తేదీన బటన్ నొక్కి ఆయన్ను ఇంటికి పంపిద్దామని వంగవీటి రాధాకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు గుంటూరు జిల్లా కేంద్రంలోని వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీయే కూటమికి చెందిన కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వంగవీటి రాధాకృష్ణ.. సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు.‘మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. బటన్ నొక్కి జగన్ అలసిపోయారు. ఈ నెల 13వ తేదీన బటన్ నొక్కి జగన్ రెడ్డిని ఇంటికి పంపిద్దాం. కులాన్ని స్వార్థం కోసం వాడుకుని పదవులు పొందితే కొంతకాలమే ఉంటుంది. వంగవీటి రంగా మాత్రం ప్రజల కోసం నిలబడటం వల్లే ప్రజల గుండెల్లో ఉన్నారు.’ అని చెప్పుకొచ్చారు రాధా. ఇదే సమయంలో పవన్ కల్యాణ్పై ప్రశంసలు కురిపించారు వంగవీటి రాధాకృష్ణ.ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారని వంగవీటి చెప్పారు. జగన్ రెడ్డి సిద్ధం అంటే జనసైనికులు సై అంటున్నారని.. కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరం తీసుకుందామని రాధా పిలుపునిచ్చారు. ఈ ప్రాంత సమస్యలను గల్లా జయదేవ్ పార్లమెంటులో వినిపించారని.. అదే విధంగా ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు వచ్చారన్నారు. ఆగిపోయిన అమరావతి నిర్మాణం ముందుకు సాగాలంటే పెమ్మసాని గెలవాలని అన్నారు.