ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాస్ట్ పేరానే దెబ్బేసిందా.. అందుకే ఇన్ని తలనొప్పులా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 08:33 PM

ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయింపు వ్యవహారంపై చర్చ నడుస్తూనే ఉంది. జనసేన పార్టీ ఎన్నికల సింబల్ అయిన గాజు గ్లాసును స్వతంత్రులకు కేటాయిస్తే.. తమ ఓట్లు ఎక్కడ చీలిపోతాయో అనే టెన్షన్‌లో టీడీపీ కూటమి నేతలు ఉన్నారు. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తామని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. జనసేన పోటీ చేస్తున్న చోట్ల గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు ఇవ్వమని తెలిపింది. అయితే ఏపీవ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించాలని.. జనసేన పోటీలో ఉన్నా, లేకున్నా గాజు గ్లాసు గుర్తును వారికే ఫ్రీజ్ చేయాలని ఎన్డీఏ కూటమి కోరుతోంది. ఈ నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే ఎందుకు కేటాయించలేదనే దానిపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు.


"గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ఏదైనా సరే కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల్లో చాలా చోట్ల పోటీ చేస్తున్నందున అన్నిచోట్లా ఒకే గుర్తు ఉంటే ప్రచారానికి సులభమవుతుందనే ఉద్దేశంతో కామన్ సింబల్ కోరతారు. ఇందుకోసమే కామన్ సింబల్ ఇవ్వాలని ఈసీని కోరవచ్చు. వారి దరఖాస్తును పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం.. సింబల్ ఆర్డర్ 10బి కింద కామన్ సింబల్ కేటాయిస్తుంది. అయితే ఈ ఆర్డర్‌లో లాస్ట్ పేరాలో ఓ నిబంధన ఉంటుంది. దరఖాస్తులో పేర్కొన్న విధంగా అన్నిచోట్లా పోటీ పెట్టకపోతే.. ఆ సింబల్ ఫ్రీ సింబల్ జాబితాలోకి వెళ్తుందని, ఎవరికైనా కేటాయిస్తామని అందులో రూల్ ఉంటుంది. ఒక వేళ ఏదైనా క్లిష్టపరిస్ఠితి వస్తే.. సింబల్ ఆర్డర్ 18 కింద ప్రత్యేక ఆదేశాలు ఇస్తారు" అని ముకేష్ కుమార్ మీనా చెప్పారు.


జనసేనకు గ్లాస్ సింబల్‌ను ఏపీ వ్యాప్తంగా ఎందుకు ఇవ్వలేం అంటే..: ఈసీ


మరోవైపు జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో గాజు గ్లాసు గుర్తును వేరేవారికి కేటాయించలేదని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే జనసేన పోటీ చేస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా గాజుగ్లాసు గుర్తును వేరే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించలేదని చెప్పారు. ఇక ఇప్పటికే గాజుగ్లాసు గుర్తును కేటాయించిన 7 లోక్ సభ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో గుర్తుల కేటాయింపులో మార్పులు చేసినట్లు చెప్పారు.


మరోవైపు గాజుగ్లాసు కేటాయింపుపై ఎన్డీఏ కూటమి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిందని కోర్టుకు ఈసీ వివరించింది. బుధవారం రాత్రే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలు ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు పంపినట్లు తెలిపింది. ఇతరులకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఈ దశలో మార్చలేమని ఈసీ వెల్లడించింది. పిటిషనర్ కోరిన విధంగా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com