చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు తెలుసని, ఎన్నికలు వచ్చేసరికి హడావిడిగా హామీలు ఇవ్వడం.. అమలు చేయకపోవడం బాబుకు అలవాటేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జీవితాలతో చెలగాటమాడతాడని, మళ్లీ జన్మభూమి కమిటీలు, పాత వ్యవస్థతో చీకటి రోజులు తెచ్చుకోవడమేనని ప్రజలను అప్రమత్తం చేశారు. చంద్రబాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలేనని.. చేయగలిగినవి మాత్రమే సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. అర్హత ఉన్నవాళ్లందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించారు.. చంద్రబాబు మాత్రం కండీషన్స్ అప్లై అంటూ పథకాల్లో కోత పెట్టాడు. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ అనేవి అమలు చేయడన్నారు. చంద్రబాబు సాధ్యం కాని మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని, అసలు బీజేపీ గుర్తును కూడా ఆ మేనిఫెస్టో మీద వాడుకోవడానికి అనుమతించలేదన్నారు. కోవిడ్లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు కొనసాగించారని, రైతులు, పేదల ఎదుగుదలకు సీఎం కట్టుబడి ఉన్నారని, పేదల కోసం సీఎం వైయస్ జగన్ ఏమాత్రం వెనుకాడరని చెప్పారు.