తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకూ ప్రచారం నిర్వహించనున్నామని, ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీకి సంబంధించి 47 వేల బూత్ కమిటీల నిర్మాణం పూర్తయిందని, ప్రతి బూత్లోనూ 1 ప్లస్ 10 విధానంలో ఒకప్రెసిడెంట్, 10 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ‘జగన్ కోసం సిద్ధం’ ప్రచార కార్యక్రమం వినూత్నంగా, బహుశా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన 12 మంది నిరుపేదలను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశామని, వారి పేర్లను ఎన్నికల కమిషన్కు సమర్పించామన్నారు. బూత్ కమిటీ సభ్యులతో పాటు స్టార్ క్యాంపెయినర్లు జగన్ కోసం సిద్ధం ప్రచార కార్యక్రమంలో పాల్గొని సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఒక్కొక్కరు రెండు ఓట్లు (ఎమ్మెల్యే, ఎంపీ) వేయాలని అభ్యర్థిస్తారని చెప్పారు.