ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు గెలిస్తే మంత్రి అవుతారు.. మరొకరు గెలిస్తే ఏకంగా ముఖ్యమంత్రి అవుతారు. ఏంటా నియోజకవర్గం అనుకుంటున్నారా..? చిత్తూరు జిల్లాకు చెందిన కుప్పం అండీ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం ఇది. 2024 ఎన్నికల్లో కుప్పం పోరు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడికి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేఆర్జే భరత్ బరిలోకి దిగారు. వై నాట్ 175 అంటోన్న జగన్.. ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుణ్ని ఎలాగైనా పట్టుదలతో ఉన్నారు. అందుకే భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబుకు నియోజకవర్గం గట్టి పట్టు ఉంది. దీంతో కుప్పం ఎన్నిక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
2024 అసెంబ్లీ ఎన్నికల వేళ కుప్పంలో మొత్తం 34 నామినేషన్లు నమోదయ్యాయి. అందులో 21 నామినేషన్లను అంగీకరించిన ఎన్నికల అధికారులు.. 9 నామినేషన్లను తిరస్కరించగా.. మరో ఇద్దరు పోటీ నుంచి తప్పుకున్నారు. చివరకు కుప్పంలో 13 మంది పోటీలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యే ఉండనుంది. నియోజకవర్గ భౌగోళిక స్వరూపం విషయానికి వస్తే.. కుప్పం నియోజకవర్గానికి ఓవైపు తమిళనాడు, మరోవైపు కర్ణాటక ఉండగా.. ఈ ప్రాంతం రెండు రాష్ట్రాలకు సరిగ్గా మధ్యలో ఉంటుంది. దీంతో సహజంగానే పొరుగు రాష్ట్రాల ప్రభావం కూడా కుప్పంపై ఉంటుంది. చిత్తూరు లోక్ సభ స్థానం పరిధిలోకి వచ్చే కుప్పం నియోజకవర్గంలో.. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలు ఉన్నాయి.
కుప్పం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. 1989 నుంచి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లోనూ గెలిస్తే.. ఆయన ఎనిమిదోసారి కుప్పం ఎమ్మెల్యే అవుతారు. చంద్రబాబు నాయుడి కంటే ముందు టీడీపీ నేత రంగస్వామి నాయుడు 1983, 1985 ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
34 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉండటంతో.. చంద్రబాబు నాయుడికి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. అయినా సరే ఈసారి బాబును కుప్పంలో ఓడిస్తామని వైసీపీ ధీమాగా చెబుతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2014 ఎన్నికల ముందు నుంచే కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2014 ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమౌళి వైసీపీ తరఫున పోటీ చేయగా.. ఆయనపై బాబు 47 వేల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ చంద్రమౌళికే జగన్ టికెట్ కేటాయించారు. ఈసారి బాబు మెజార్టీ 30 వేలకు తగ్గింది.
2020లో చంద్రమౌళి కన్నమూవారు. దీంతో ఆయన కుమారుడు భరత్ను ఎమ్మెల్సీ చేసి, నియోజకవర్గ ఇంఛార్జ్గా బాధ్యతలు అప్పగించిన జగన్.. బాబుకు పోటీ యువ నేతను సిద్ధం చేశారు. కుప్పంలో పార్టీని గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భుజానికెత్తుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో అధికార పార్టీ హవా నడిచింది. కుప్పం అభివృద్ధిపై శ్రద్ధ పెట్టిన జగన్.. బాబు రిక్వెస్ట్తో కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేశారు. హంద్రీనివా జలాలను సైతం నియోజకవర్గానికి అందించామని జగన్ చెప్పారు.
1996లో సీఎం అయిన తర్వాత కుప్పంలో ప్రచారం ప్రచారం చేయడం చంద్రబాబు మానేశారు. ప్రతిసారి ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం ఆయన నియోజకవర్గంలో పర్యటించేవారు. భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కుప్పంలో బాబు తరఫున ప్రచారం చేస్తే.. ఆయన రాష్ట్రమంతా పర్యటించేవారు. కానీ 2019లో మెజార్టీ తగ్గడం, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడంతో బాబు అలర్ట్ అయ్యారు. కుప్పంలో తరచుగా పర్యటించడంతోపాటు.. రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్ల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. క్రియాశీల కార్యకర్తలతోనూ బాబు రహస్య భేటీలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తనకు లక్ష ఓట్ల మెజార్టీ కట్టబెట్టాలని టీడీపీ అధినేత ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ ఛైర్మన్గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను బాబు నియమించారు. నియోజకవర్గ ఇంఛార్జ్గా పీఎస్ మునిరత్నాన్ని నియమించిన బాబు.. సమన్వయ కమిటీ కన్వీనర్గా ఆర్ చంద్రశేఖర్కు బాధ్యతలు అప్పగించారు.