ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో పది రోజుల్లో ఎన్నికల పోలింగ్.. ఈసీకీ టీడీపీ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 07:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పెంచాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాశారు. ఏపీలో ఉన్న ఎండల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని మరో గంటపాటు పొడిగించాలని కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని.. ఈసీ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని మరో గంటపాటు పోలింగ్ వేళలను పొడిగించాలని రవీంద్ర కుమార్ కోరారు. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోలింగ్ సమయాల్లో ఈ మేరకు మార్పులు చేయాలని కనకమేడల రవీంద్ర కుమార్.. ఈసీకి లేఖలో విజ్ఞప్తి చేశారు.


సాధారణంగా పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకూ ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓ గంట ముందుగానే పోలింగ్ ముగుస్తుంది. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితుల్లో.. పోలింగ్ సమయాన్ని ఆరు గంటల వరకూ పొడిగించాలని టీడీపీ కోరుతోంది. ఉదయం పదిగంటల నుంచే భానుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎండ వేడిమి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. దీంతో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా.. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించాలని కనకమేడల కోరారు.


మరోవైపు తెలంగాణలో ఇప్పటికే పోలింగ్ సమయాన్ని ఒక గంటపాటు పొడిగించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలూ ఈసీకి విజ్ఞప్తి చేయడంతో.. ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లేఖలో ప్రస్తావించిన కనకమేడల.. సమయాన్ని పొడిగిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీ జరుగుతుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలాఖరునాటికే చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. పైగా మే నెల మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com