ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి హోరాహోరీ తలపడుతున్నాయి. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పునర్వైభవం సాధించాలని టీడీపీ తహతహలాడుతున్నాయి. దీంతో అధికారమే లక్ష్యంగా హామీలు కురిపిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయగా.. తాజాగా మంగళవారం టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా మేనిఫెస్టో ప్రకటించింది. ఇక రెండు పార్టీల మేనిఫెస్టోలను ఓసారి పరిశీలిస్తే.. అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలో సారూప్యత కనిపిస్తున్న పథకాలు.. అమ్మ ఒడి, తల్లికి వందనం. నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కారు పిల్లలను అమ్మ ఒడి పథకం పేరిట బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 15 వేలు జమచేస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఈ మొత్తాన్ని 15 వేల నుంచి 17 వేలకు పెంచుతామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇదే తరహా హామీ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోనూ ఉంది. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు దీనికి సంబంధించి హామీ ఇచ్చారు. తాము గెలిస్తే తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేలు చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇక అత్యంత కీలకమైన హామీ ఏమింటటే పింఛన్లు. ఏపీవ్యాప్తంగా ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వైసీపీ నెలకు మూడు వేల రూపాయల పింఛన్ అందిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రెండు దఫాల్లో నాలుగు వేలకు పెంచుతామని జగన్ ప్రకటించారు. 2028లో రూ.3500లకు, 2029 జనవరిలో రూ.4000 వేలకు పెంచుతామన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 2024 ఏప్రిల్ నుంచే పింఛన్ మొత్తాన్ని రూ.4000 చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పింఛన్ బకాయిలు కలిపి జూన్ నెలలోనే రూ.7000 అందిస్తామంటోంది. అలాగే దివ్యాంగులకు నెలకు ఆరువేలు పింఛన్ అందిస్తామని.. వందశాతం దివ్యాంగులు అయితే రూ. 10,000 అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది.
ఇక రెండు పార్టీలు ప్రకటించిన హామీల్లో సారూప్యత ఉన్న మరో అంశం కూడా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.13500 చొప్పున వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం అందించే ఆరువేలతో కలిపి ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి రూ.16 వేలకు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే..
మరోవైపు 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 సాయం అందిస్తోంది. మొత్తంగా ఐదేళ్లలో రూ.75000 ఆర్థిక సాయం అందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి మాత్రం ఇందుకు కాస్త భిన్నమైన పథకాన్ని ఎంచుకుంది. వైసీపీ 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అంటూ హామీ ఇస్తే టీడీపీ మాత్రం 19 నుంచి 59 ఏళ్లలోపున్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.
ఇక వైసీపీ మూడు రాజధానుల విధానానికి కట్టుబడగా.. టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉంటుందని చెబుతోంది. ఇక వైసీపీ ప్రకటించని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేదీ చూడాలి మరి.