ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కళ్యాణ్‌ను ఓడించకపోతే.. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా: ముద్రగడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 07:26 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి విరిుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలా గెలుస్తారో చూస్తానని.. పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తాను పేరు మార్చుకుంటానుంటూ సవాల్ చేశారు. కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన ముద్రగడ పద్మనాభం.. పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నాడని.. విషయ పరిజ్ఞానం లేక ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలియని విషయం తెలుసుకునే సమయం కూడా ఆయనకు లేదంటూ ఎద్దేవా చేశారు.


తుని రైలు ఘటనపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. "తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రూ వైసీపీలోనే ఉన్నాడని తెలుసుకో. తుని రైలు సంఘటనకి చంద్రబాబు కారణం. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. నన్ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ నాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు" అని ముద్రగడ పద్మనాభం విమర్శించారు.


మరోవైపు కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఏనాడైనా పోరాడారా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలును తిట్టడానికి పవన్‌కు ఉన్న హక్కు ఏంటని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఏరోజైనా కాపుల కోసం రోడ్డెక్కి పోరాటం చేశారా అంటూ విమర్శించారు. కాపుల ఉద్యమానికి ఏనాడూ మద్దతివ్వలేదని విమర్శించారు.ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చాడన్న ముద్రగడ.. అసలు పవన్ కళ్యాణ్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది కానీ.. రాజకీయాల్లో కాదన్నారు. త్వరలోనే జనసేన ప్యాకప్ అవుతుందని.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను తన్ని తరిమేస్తారని ముద్రగడ ఎద్దేవా చేశారు. ఉప్మా, కాఫీ అని పవన్ తనను అవమానిస్తున్నారన్న ముద్రగడ పద్మనాభం.. అలా అనడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. గౌరవించడం తమ అలవాటని.. నీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికి అయినా కనీసం కాఫీ ఇచ్చారా? అని నిలదీశారు. 1978లో చంద్రబాబుకు ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్థోమత లేదన్న ముద్రగడ పద్మనాభం..రెండు ఎకరాలు నుంచి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.


మరోవైపు ఏపీలో ఎన్డీయే కూటమికి చిరంజీవి మద్దతు ఇస్తారనే వ్యాఖ్యలపైనా ముద్రగడ పద్మనాభం స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికి కూటమికి మద్దతిచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తేనే గౌరవిస్తారన్న ముద్రగడ.. ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం సమస్యలపై చిరంజీవి ఎందుకు బయటకురాలేదన్నారు. అప్పుడు బయటకు రాని చిరంజీవి.. ఇప్పుడు మద్దతుగా వీడియోలు రిలీజ్ చేస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయమన్న ముద్రగడ పద్మనాభం.. పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com