ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ బొమ్మ ఎందుకు లేదో చెప్పిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 07:23 PM

 ఏపీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. నేతల మధ్య మాటలయుద్ధం పెరుగుతోంది. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే పార్టీలు మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ తన మేనిఫెస్టో రిలీజ్ చేయగా.. టీడీపీ కూటమి సైతం ఇవాళ ఎన్నిక మేనిఫెస్టో విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతలు ఎన్డీయే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ పాల్గొన్నారు. అయితే టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై జగన్ స్పందించారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఇవాళ అన్నమయ్య జిల్లా కలికిరిలో పర్యటించారు. కలికిరిలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. టీడీపీ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ఎన్డీయే కూటమిలో మూడు పార్టీలు ఉంటే.. ఉమ్మడి మేనిఫెస్టోలో మూడు పార్టీల గుర్తులు పెట్టుకునే పరిస్థితి కూడా లేదంటూ విమర్శించారు. " ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారనగానే.. బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్ చేసింది. మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి కానీ.. మోదీ ఫోటో పెట్టొద్దని చెప్పింది. మోదీ ఫోటో పెడితే ఒప్పుకోమని బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు. ఉచిత హామీలతో ప్రజలకు మోసం చేసేందుకు చంద్రబాబు బరితెగించారు. చివరకు మూడు పార్టీల గుర్తులు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన హామీలు మోసం దీంతో తేలిపోయింది" అంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.


అయితే ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాని మోదీ, బీజేపీ గుర్తు లేకపోవటంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ పార్టీ అని.. ఆ పార్టీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందని చెప్పారు. జాతీయ పార్టీకి ప్రత్యేకంగా రాష్ట్రాలలో మేనిఫెస్టోలు ఉండవన్న చంద్రబాబు.. మేనిఫెస్టోలో చెప్పిన హామీల అమల్లో మాత్రం కేంద్రం సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అయితే మేనిఫెస్టో సమయంలో జరిగిన ఈ పరిణామాలు ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మేనిఫెస్టో విడుదలకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం గైర్హాజరు కావటం చర్చకు తావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com