ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను భయపెడుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జివి రెడ్డి సోమవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల ఆస్తులను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకువెళ్తుంది.ఈ చట్టం వచ్చిన తర్వాత భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. టీఆర్వో వద్దకు వెళ్లాలి. భూముల కబ్జాకు వైసీపీ నేతలే వివాదం సృష్టించి టీఆర్వో వద్ద తేల్చకుండా పెండింగ్లో ఉంచి సెటిల్మెంట్ పేరుతో దండుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది’ అని చెప్పారు. తమ ప్రభుత్వం వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని జీవీ రెడ్డి తెలిపారు.