ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన టీడీపీ రెబల్ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సోమవారం తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఇక్కడ టికెట్ కేటాయించడంతో అలకబూనిన ముద్దరబోయిన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా చేశారు. టీడీపీ ముఖ్య నాయకులు ముద్దరబోయినతో పలుమార్లు చర్చలు జరిపారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. చంద్రబాబు నచ్చచెప్పడంతో అలకవీడిన ముద్దరబోయిన తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. సోమవారం కర్నూలు ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబును కలవడానికి అనుచరులతో కలసి వెళ్లారు. దీంతో నూజివీడు నియోజకవర్గంలోని టీడీపీలో సంక్షోభం సద్దుమణిగింది. రాష్ట్ర పార్టీలో ముద్దరబోయినకు కీలకపదవి ఇచ్చి గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో ఆయన సేవలను వినియోగించుకోనున్నట్టు సమాచారం.