మే నెల సామాజిక పింఛన్ల సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని టీడీపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.సోమవారం అమరావతి సచివాలయంలో సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు కలిసి, పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు.రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై, ప్రచార వాహనాలపై దాడులు జరుగుతున్నా రిటర్నింగ్ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నారు.రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీని వీడి, వైసీపీలో చేరనన్నందుకు ఒక బీసీ, ఇద్దరు దళిత నాయకులపై వైసీపీ నేతలు దాడి చేయడం, ఎన్డీయే ప్రచార వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.