ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పార్టీల్లోకి జంపింగ్లు జరుగుతున్నాయి. కొందరు నేతలు ఉదయం ఒక కండువా వేస్తే.. మళ్లీ సాయంత్రానికి మరో కండువా మార్చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు మూడు నెలల్లో రెండు పార్టీలను మార్చేయడం విశేషం. ఆయనెవరో కాదు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. మూడు నెలల్లోనే వీరశివారెడ్డి రెండు పార్టీల అధినేతల సమక్షంలోనే కండువా కప్పుకున్నారు.
వీరశివారెడ్డి కమలాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చిన ఆయన కమలాపురం టికెట్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ దక్కకపోవడంతో.. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి చివరి వారంలో.. వైఎస్సార్సీపీని వీడి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈసారి కూడా వీరశివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు.
ఇటీవలే ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, టీడీపీ నేత బీద రవిచంద్ర వీరశివారెడ్డితో ప్రొద్దుటూరులో మంతనాలు జరిపారు. ప్రవీణ్కుమార్రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తే టీడీపీలో కొనసాగుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ నెల 25న పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సరిగ్గా 2019లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి మారిపోయిన ఈ నేత.. ఇటీవల టీడీపీలో చేరి.. అక్కడి నుంచి మళ్లీ వైఎస్సార్సీపీలోకి వెళ్లడం విశేషం.
వీరశివారెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో.. తెలుగు దేశం పార్టీలో పనిచేశారు. కమలాపురం నియోజకవర్గం నుంచి 1994లో టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 1999లో మరోసారి టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ 2004 ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరి.. కమలాపురం నుంచి పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. వీరశివారెడ్డి మొదటి నుంచి చూస్తే.. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, మళ్లీ టీడీపీ, మరోసారి వైఎస్సార్సీపీలోకి మారారు.