విశాఖ స్టీల్ప్లాంటును విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనా.. అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమని షర్మిల పేర్కొన్నారు. స్టీల్ప్లాంటును అమ్మేందుకు కేంద్రం సిద్ధమైనా వైసీపీ ఎంపీలు కనీసం పోరాటం చేయలేదని విమర్శించారు. ప్లాంటు పరిరక్షణకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే పోరాడుతున్నాయన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను రూ.600 కోట్లకు అమ్మేశారని, 30 ఏళ్లపాటు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా వైఎ్సఆర్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని, కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన దానిని వెంటనే అమ్మేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ప్లాంటును అంబానీ, అదానీలకు అమ్మేందుకు సిద్ధపడుతున్నారన్నారు. ప్లాంటుకు అవసరమైన సరుకు, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, తద్వారా ప్లాంటు నష్టాల్లోకి వెళ్లేలా చేసి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని, రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, పేదింటి మహిళకు ఐదేళ్లలో ఐదు లక్షల ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. పెన్షన్ నాలుగు వేలు కావాలన్నా, పక్కా ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ గెలవాలన్నారు. ఆదివారం ఉదయం స్టీల్ప్లాంటు సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను జగన్ అమలు చేయలేకపోయారని, ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో వల్ల ఉపయోగం ఏమీ లేదని అన్నారు. వైసీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలో చిత్తు కాగితంలా ఉందని విమర్శించారు.