తిరుమలలో కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి వెళ్లి తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో ప్రచారం మహా భాగ్యమన్నారు. ఐదేళ్లలో తిరుమలను కలుషితం చేశారని మండిపడ్డారు. దర్శనం పేరుతో భక్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక భక్తులకు సౌకర్యవంతంగా దర్శనాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. తిరుమల, తిరుపతి స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం పునరుద్ధరణ చేస్తామని కూటమి అభ్యర్థి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో మంచి చేస్తామని.. తిరుపతి ప్రజలను మోసం చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభినయ్ రెడ్డి గెలుపు కోసం టీటీడీ నిధులను వాడారని ఆరోపించారు. ఐదు సంవత్సరాలకు ఖర్చు అయ్యే నిధులను కరుణాకరరెడ్డి మూడు సమావేశాలకు మంజూరు చేశారన్నారు. తిరుమలలో అనధికార దుకాణాలపై జరిగిన అక్రమాలపై టీడీపీ వచ్చాక విచారణ జరిపిస్తామని సుగుణమ్మ వెల్లడించారు.