ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పక్కాగా ఆయనే గెలుస్తాడు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:45 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ప్రచారాలతో రెండు రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. ఏపీ ఎన్నికలపై తనదైన అభిప్రాయాన్ని పంచుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రాంతీయ పార్టీలే గెలవాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇతర చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తమకున్న సమాచారం మేరకు.. ఈసారి ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. పలు సర్వేల ద్వారా తమకు సమాచారం ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాగా.. అటు కేసీఆర్, కేటీఆర్ ఇదే మాటను పదే పదే చెప్తుండగా వీళ్ల కామెంట్లపై ఏపీలో చర్చ జరుగుతోంది.


మరోవైపు.. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలవడం కష్టమే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దెర మాటలని.. వాళ్లు చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్- 1 వర్కవుట్ అవటంతో.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టారంటూ ఆరోపించారు.


దేవుళ్ల సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడన్నారు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదని.. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నాడన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నాడని చెప్పుకొచ్చారు.


రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు..? మోదీ నాయకత్వంలోనా..? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీలో చేరతాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి 20 సార్లు తాను ఈ మాట చెప్పినా సరే.. ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదన్నారు. వంద రోజుల్లో చేస్తా అన్న పనిని కనీసం 250 రోజుల్లో అయినా కూడా చేయట్లేదని.. అందుకే రేవంత్ రెడ్డి స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయరంటూ మరోసారి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడని కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఏ శలువాకి కట్టుబడి ఉన్నాడో చెప్పాలన్నారు.


మల్లారెడ్డి తన రాజకీయ అనుభవంతో వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారని చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్‌ని మునగ చెట్టు ఎక్కిచ్చి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారన్నారు. మల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని తెలిపారు. అది ఈటల రాజేందర్‌కి కూడా తెలుసన్నారు. మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెలియక కొంతమంది ఆగమావుతున్నారన్నారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయినా సరే.. శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యమన్నారు. బీఆర్ఎస్‌లోనే తనకు గౌరవం ఉండేదని.. పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com