ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 07:39 PM

ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. నిన్నటి వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగ్గా.. ఇవాళ (శుక్రవారం) అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలుత షేక్ బషీద్‌‌ను ప్రకటించారు. ఆయనకే బీఫారం ఇచ్చారు. దీంతో బీఫామ్ తీసుకుని వెళ్లి షేక్ బషీద్ నామినేషన్ వేశారు. అయితే ఇక్కడే సీన్ రివర్సైంది.


తెనాలి అభ్యర్థిని చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది . గురువారం నామినేషన్ దాఖలుకు ఆఖరిరోజు కాగా.. చివరిరోజు అభ్యర్థిని మార్చారు. బషీద్ స్థానంలో తెనాలి స్థానికుడైన డాక్టర్ చందు సాంబశివుడును తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చందు సాంబశివుడు గురువారం ఆఖర్లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల అధికారులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బషీద్‌తో పాటు చందు సాంబశివుడి నామినేషన్లను తిరస్కరించారు. మరోవైపు తెనాలి అసెంబ్లీ స్థానానికి కూటమి తరుఫున జనసేన నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మరోసారి బరిలో ఉన్నారు. వీరి నామినేషన్లతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు తుంపల నరేంద్ర, అశోక్ కుమార్, జి. రామకృష్ణ, తెలుగు జనతా పార్టీ అభ్యర్థి కె.నాగరాజు నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 5 వేల 993 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే 25 ఎంపీ సీట్లకు 1103 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ సమయం ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యాక.. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యమీద స్పష్టత రానుంది. మే 13వ తేదీ.. ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీ ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ ఒంటరిపోరుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. జై భీమ్ నేషనల్, బీసీవై వంటి పార్టీలతో పాటుగా స్వతంత్రులు కూడా పలుచోట్ల నామినేషన్లు దాఖలు చేశారు,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com