మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు. పియూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా?. అసలు విద్యాశాఖ లో అవినీతి జరిగిందని చెప్పగలరా?.ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డ్ శాతం ఫలితాలు వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారు. బావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి అని అన్నారు.