మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను తాడేపల్లి పెద్దలకు పంపించారు డొక్కా. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డొక్కా.. అదును చూసి దెబ్బ వేశారు. ఎన్నికల ముంగిట పార్టీకి రిజైన్ చేశారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. మంత్రిగా కూడా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం డొక్కా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2020లో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే, గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న డొక్కా.. ఇప్పుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.