ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:25 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నామినేషన్‌ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్‌.. అంతకు ముందు సీఎస్‌ఐ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చిన్నాన వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?.. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా?.. ఎవరు ఫోన్‌ చేస్తే అవినాష్‌ అక్కడికి వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు. అవినాష్ ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా.. వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పు చేయలేదన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చానన్నారు. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని.. పసుపు మూకలతో చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారన్నారు. తన సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.


'వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?' అంటూ జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో పేర్కొంది ఎవరు?.. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్‌ వారసులా?' అంటూ ఘాటుగా స్పందించారు. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్‌ వారసులు?.. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు sl ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారన్నారు.


వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్‌ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని.. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలన్నారు. వైఎస్సార్ పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? అన్నారు. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?.. నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?.. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా? అన్నారు.


కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయని.. తన తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్‌ వల్లే ఈ అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు జగన్. పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ 'మనపై' వేలెత్తి చూపిస్తున్నారన్నారు. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం ఇక్కడి కల్చర్‌.. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది పులివెందుల బిడ్డే అన్నారు. పులివెందుల తన ప్రాణమని..పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్‌ స్టోరీ అన్నారు. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్‌.. ఆయన బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ ప్రభుత్వమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com