విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం 47 డివిజన్ కొండ ప్రాంతంలో సుజనాచౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంత ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో నెంబర్ వన్లో ఉండాలని.. కానీ ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వెనుకబడి పోయిందని విమర్శించారు. ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలిగిందన్నారు. ఎక్కడకి వెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెడుతున్నారన్నారు. కనీస మౌలిక వసతులు కూడా లేక అవస్థలు పడుతున్న తీరు ఆవేదన కలిగించిందని తెలిపారు. అభివృద్ధి చేశామని చెప్పుకునే వారు ఏం చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అబద్దాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఓట్ల కోసం హామీ ఇచ్చి అమలు చేయని వారిని రీకాల్ చేసే విధానం రావాలన్నారు. అప్పుడే ప్రజాప్రతినిధులు మోసం చేయలేరని... ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో తనకున్న పరిచయాలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, సుజనా ఫౌండేషన్ పేరుతో ఎంతో అభివృద్ధి చేశానని.. సేవ చేశానని తెలిపారు. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ప్రధాని మోదీని ఈ నియోజకవర్గానికి తీసుకు వస్తానని.. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కూటమి అభ్యర్థి గా గెలుస్తానని... ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని సుజనాచౌదరి స్పష్టం చేశారు.