ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 09:11 PM

ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఈ ప్రశ్నకు సమాధానం జూన్ 4న తెలియనుంది. మే 13న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ ఓటేయనుండగా.. ఈలోపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అభివృద్ధిని విస్మరించారని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రచారం చేస్తుండగా.. సంక్షేమ పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీ ఎన్నికల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగనే అధికారంలోకి వస్తారనేది తన దగ్గరున్న సమాచారం అన్నారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగేదేమీ లేదన్న గులాబీ బాస్.. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదన్నారు.


తెలంగాణ మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పొచ్చు. తమ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యల పట్ల గుర్రుగా ఉన్నాయి. ‘సొంత రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఓడిపోతుంటే.. అంచనా వేయలేకపోయిన నువ్వు.. మా రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో చెబుతున్నావా?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.


కేసీఆర్ వ్యాఖ్యలు వైసీపీకి జోష్ తెచ్చేవే అయినప్పటికీ.. ఆయన మాటలు నిజమవుతాయో కాదో అప్పుడేం చెప్పలేం. అంతే కాదు 2014లో ఎన్నికలు ముగియగానే మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తున్నామని.. ఏపీలో వంద సీట్లలో జగన్ గెలవబోతున్నాడని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే తెలంగాణలో గులాబీ జెండా ఎగిరింది. కానీ ఏపీలో మాత్రం ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. జగన్ పార్టీ కొద్ది తేడాలో ఓడిపోగా.. తెలుగుదేశం-బీజేపీ కూటమి విజయం సాధించడంతో నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. 2014 ఎన్నికల సమయం నుంచే కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గులాబీ బాస్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పారు. అంతే 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్సీపీ పోటీ చేసింది. కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసం టీఆర్ఎస్సే జగన్‌ పార్టీని తెలంగాణలో పోటీ చేయించిందనే ప్రచారమూ అప్పట్లో జరిగింది.


అంతే కాదు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కట్టడం.. చంద్రబాబుపై కేసీఆర్‌కు కోపం తెప్పించింది. ఆ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అన్నట్టుగానే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి, జగన్ విజయానికి తన వంతుగా ఆయన సహకారం అందించారు. ఇప్పుడు జగన్ గెలుస్తారనేది తనదగ్గరున్న సమాచారం అంటూ కేసీఆర్ మరోసారి తన మిత్రుడికి లబ్ధి కలిగేలా మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com