ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి గెలిస్తే నందికొట్కూరుని నందనవనంగా మారుస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 08:05 PM

వచ్చే ఎన్నికల్లో నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగరేస్తామని పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. సోమవారం ఉదయం 11.39 గంటలకు టీడీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య నామినేషన్‌ దాఖలు చేశారు. పత్రాలను ఎన్నికల అధికారి దాసుకు అందజేశారు. అంతకుముందు ఉదయం జయసూర్య సొంత గ్రామమైన అల్లూరులో గోమాతకు పూజలు నిర్వహించి, ఆ తర్వాత సుంకులమ్మ, శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాండ్ర శివానందరెడ్డి ఇంటికి చేరుకొని మాండ్ర గిడ్డారెడ్డి దంపతుల చిత్రపటాలకు నమస్కరించి... అక్కడి నుంచి కార్యకర్తలతో నందికొట్కూరుకు బయలుదేరారు. టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, మాండ్ర లింగారెడ్డి, మునాఫ్‌, రామయ్యతో కలిసి జయసూర్య నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లి ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను అధికారి దాసుకు అందజేశారు. అనంతరం అల్లూరు గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శివానందరెడ్డి మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో చంద్రబాబు గానీ, పవన్‌ కళ్యాణ్‌ గానీ పర్యటిస్తారని, అందుకే ప్రస్తుతం నిరాడంబరంగా నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. కార్యకర్తలు ఎవ్వరూ అసంతృప్తి చెందవద్దని ఆయన సూచించారు. ప్రచారం మరింత ఉధృతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జయసూర్య మాట్లాడుతూ ఈ ఐదేళ్ల జగన్మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని అన్నారు. 2019 ఎన్నికల ముందు జగన్‌ నందికొట్కూరును నందనవనంగా చేస్తానని ప్రగల్భాలు పలికిన ఆయన సీఎం హోదాలో ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా నందికొట్కూరు రాలేదన్నారు. తనను అసెంబ్లీకి పంపించడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తనకు టిక్కెట్‌ ఇప్పించిన ఘనత మాండ్ర కుటుంబానికే దక్కుతుందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్రంలో విధ్వంసకర పాలనను కొనసాగించారన్నారు. ఈ పాలనను అంతమొందించడానికి మాండ్ర శివానందరెడ్డి కంకణబద్దులై ఉన్నారన్నారు. నియోజకవర్గాన్ని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచించారన్నారు. కావున టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్యలను తప్పకుండా గెలిపించుకోవాల్సిన ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com