ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 09:27 PM

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ-ఎస్‌ఎంవీ బెంగళూరు(08549) ప్రత్యేక రైలు ఈ నెల 27 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖలో బయలు దేరి మర్నాడు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఎస్‌ఎంవీ బెంగళూరు-విశాఖ(08550) ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు విశాఖ వస్తుంది.


విశాఖలో ప్రారంభమయ్యే ఈ రైలు.. ఏపీలోని దువ్వాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది. అంతేకాదు తిరుమల వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. రేణిగుంట స్టాప్ ఉండటంతో.. భక్తులు అక్కడ దిగి తిరుమలకు వెళ్లిపోవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు రైల్వే అధికారులు.


వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది వేసవిలో 6,369 ట్రిప్పులు నడపగా ఈసారి దానిని 9,111కి పెంచినట్లు వెల్లడించింది. ప్రధాన రైలు మార్గాల్లో ఇబ్బందుల్ని తొలగించేరీతిలో 2,742 ట్రిప్పుల్ని పెంచినట్లయిందని తెలిపింది. అత్యధికంగా 1,878 ట్రిప్పులు పశ్చిమ రైల్వేలో ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,012 ట్రిప్పులు తిరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, యూపీ, రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల మీదుగా వేసవి రైళ్లు రాకపోకలు చేయనున్నాయి.


రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జోన్‌ పరిధిలో 649 కి.మీ.ట్రాక్‌ని పునరుద్ధరించినట్లు తెలిపింది. వేసవి కాలంలో జోన్‌ పరిధిలో 1079 ట్రిప్పుల అదనపు రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు ఏప్రిల్‌, మే నెలల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com