ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనుకు చిత్తశుద్ధి ఉంటే తనపై జరిగిన రాయి దాడిపై సీబీఐ విచారణ కోరాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 01:41 PM

ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ  పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తనను నిత్యం వేధిస్తూనే ఉన్నారన్నారు. నిన్న తనపై ఓ యుద్ధానికి వచ్చినట్టు పోలీసులను పంపారన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు కేసులు పెట్టినట్టు.. ఇప్పుడు తనపై కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వేముల సతీష్‌తో జడ్జి ఎదుట 164 స్టేట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసిందని బోండా ఉమ వెల్లడించారు.సతీష్, అతని కుటుంబ సభ్యులతో బలవంతంగా స్టేట్మెంట్ ఇచ్చేలా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఐపీఎస్ చదివిన వారు.. ఓ నేరగాడి చేతిలో కీలు బొమ్మలుగా మారారని బోండా ఉమ అన్నారు. మా పేర్లు చెప్పమని సతీష్, ఆయన కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తన మీద.. చంద్రబాబు మీద కక్ష సాధించేందుకు కాంతి రాణా వడ్డెర కాలనీని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తే కాంతి రాణా సెల్యూట్ కొడుతున్నారని అన్నారు. తెలంగాణలో తప్పులు చేసిన అధికారులు ఎలాంటి శిక్ష ఎదుర్కొంటున్నారో కాంతి రాణా తెలుసుకోవాలని బోండా ఉమ అన్నారు. ‘‘నాపై అక్రమ కేసులు పెడితే ఈజీగా వదిలిపెట్టను. అన్న క్యాంటీన్ తొలగించినందుకు.. రోడ్ షోకు వస్తే ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడం వల్లే రాయి విసిరానని వేముల సతీష్ చెప్పాడు. వేముల సతీష్, అతని కుటుంబ సభ్యులను బెదిరించి 164 స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. మా కార్యకర్త దుర్గారావు వడ్డెర కాలనీలో ఉండడం.. అతని ఇంటి పేరు వేముల కావడమే దుర్గారావు నేరం. దుర్గారావు ఆచూకీ తెవియడం లేదు. సీఎం మీద గులకరాయి దాడి కేసును సీబీఐ ఎంక్వైరీ వేయాలని మేం డిమాండ్ చేశాం. గతంలో కోడి కత్తి తరహాలో మళ్లీ ఏదో చేస్తున్నారని అనుమానం ఉంది. వడ్డెర కాలనీలో ఆడవాళ్లని కూడా పోలీసులు కొడుతున్నారని.. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరాం. జగనుకు చిత్తశుద్ధి ఉంటే తనపై జరిగిన రాయి దాడిపై సీబీఐ విచారణ కోరాలి. వేముల దుర్గారావు ప్రాణాలతోనే ఉన్నాడా..? లేక వివేకాలా చంపేశారా..? తప్పు చేసిన అధికారులను జైళ్లకు పంపడం ఖాయం. కాంతి రాణా వ్యవహరంపై హైకోర్టు సీజేకు మెసేజ్ పెట్టాను. క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏమైనా జరగొచ్చు.. నన్నే ఏ-1గా పెట్టొచ్చు. టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకోనియకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ కొందరి పోలీసులని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహరంపై ఈసీ చర్యలు తీసుకోవాలి. ఇదే పోలీస్ ఉన్నతాధికారులు ఉంటే.. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగదు’’ అని బోండా ఉమ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com